ఈనెల 29వ తేదీన జరిగే ఉప ఎన్నికలు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) రాజకీయ మనుగడకు అగ్నిపరీక్షలాంటివని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలు ప్రత్యేక తెలంగాణా అంశానికి రెఫరెండం కాబోవని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల వల్ల రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకోబోవని ఆయన చెప్పారు. ముషీరాబాద్లో భాజపా అభ్యర్థికి తెరాస (నరేంద్ర) పార్టీ మద్దతు ప్రకటించడాన్ని వెంకయ్య ఆహ్వానించారు.
అయితే.. సీనియర్ నేత నరేంద్ర నేతృత్వంలోని తెరాస (ఎన్) పార్టీ భాజపాలో విలీనమవుతుందన్న ఊహాగానాలకు ఆయన కొట్టిపారేశారు. ఈనెల 29వ తేదీన నాలుగు లోక్సభ, 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే.
|