రాష్ట్రంలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు రాత్రిపూట పలు ప్రాంతాల్లో కరెంట్ కోత తప్పడం లేదు. దీంతో ఉక్కపోత బరించలేక జనాలు నానా హైరానా పడుతున్నారు.
అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మంచి నీటి కోసం కటకటలాడుతున్నారు. ఇలాంటి తరుణంలో 'కొంపకాలి ఒకరు ఏడుస్తుంటే... చుట్ట కాల్చుకోడానికి నిప్పులేదని మరొకడు ఏడ్చాడట' అన్న చందంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో కష్టం వచ్చి పడింది.
ఇన్నాళ్లు నీళ్లు దొరక్కపోయినా మందు మాత్రం పుష్కలంగా దొరుకుతోంది కదాని సంతోషిస్తున్న మందుబాబులకు ఇప్పుడు బీరుకు కటకట ఏర్పడింది. దీంతో ఎండాకాలం కాస్త కూల్గా బీరైనా తాగుదామంటే అదీ దొరికి చావడం లేదే అంటూ రాష్ట్రంలోని మందుబాబులు తెగ మధన పడిపోతున్నారు.
సందట్లో సడేమియాలా కొందరు బీరు బాటిళ్ల ధరను ఆమాంతం పెంచి విక్రయిస్తున్నారు. దీంతో పెంచిన ధరల కారణంగా బీరు సీసాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు చాలక కొంతమంది, చాలినంత బీరు లభించక మరికొందరు బాధపడుతున్నారు. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో ఉన్న బీరు డిమాండ్కు తగినంతగా సరఫరా లేకపోవడమేనట.
దాంతో తమ ఖాతాదారుల కష్టాలను చూచి మందు షాపు యజమానులు చలించిపోయారు. రాష్ట్రంలో ఉన్న డిమాండ్కు సరిపడనంత బీరు సరఫరా చేస్తారా? లేదా? అంటూ మందుషాపు యజమానులు బీరు కంపెనీ గోడౌన్ల వద్ద ధర్నా చేశారు. ఇదంతా చూచి త్వరలోనే బీరు సప్లై పెరిగి తమ కష్టాలు తీరుతాయని మందుబాబులు సంబరపడిపోతున్నారు.
|