మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటు ఖాయమని ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు ప్రకటించారు. చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని, అందువల్ల ఆయన వచ్చే ఆగస్టులో పార్టీని స్థాపిస్తారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన నాగబాబు ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
ఆగస్టులో చిరంజీవి పార్టీ ఏర్పాటు కావడం ఖాయమని చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటిస్తారని తెలిపారు. నేటి ప్రజల, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ జెండా, ఎజెండాలు ఉంటాయని నాగబాబు సూచన ప్రాయంగా వెల్లడించారు. మెగాస్టార్ స్థాపించే పార్టీ కార్మికులు, రైతులు, పేద, బడుగు, మైనార్టీ ఇలా అన్ని వర్గాలు, రంగాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీగా ఉంటుందన్నారు.
అలాగే పార్టీ నిర్మాణంలో అభిమానులకే పెద్ద పీట వేస్తామని, ఆ తర్వాతే మిగిలిన వారికి ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. ప్రజల్లో సమైక్యభావం రూపుమాసిపోతోందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి బావమరిది కూడా ఇదే విషయాన్ని చెప్పిన విషయం తెల్సిందే. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం వల్ల ఆ రోజున పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.
|