చిత్రకొండ సమీపంలో మావోయిస్టులు జరిపిన దాడిని పిరికి చర్యగా అభివర్ణించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. గ్రేహౌండ్స్ బలగాలపై పాశవిక దాడితో ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీశామని మావోయిస్టులు సంబరపడితే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
మావోయిస్టుల దాడిలో బాధిత పోలీసు కుటుంబాలను పరామర్శించడానికి విశాఖ వచ్చిన వైఎస్ మావోయిస్టుల చర్యపై విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి సోమవారం మధ్యాహ్నం చేరుకున్న వైఎస్ మావోయిస్టులు చేసిన దాడి వివరాలను గాయపడిన గ్రేహౌండ్స్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ కొనసాగనీయమని వైఎస్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడవలసిన అవసరం తమ భుజస్కందాలపై ఉందన్నారు.
ఒరిస్సాలోని చిత్రకొండ సమీపంలో గాలింపు చర్యల అనంతరం రాష్ట్రానికి తిరిగొస్తున్న గ్రేహౌండ్స్ దళాలపై మూడు వైపులనుంచి మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడిచేసి లాంచీని ముక్కలు చేసిన ఘటనలో దాదాపు 40 మందికి పైగా పోలీసులు గల్లంతైన విషయం తెలిసిందే.
దేశ చరిత్రలో జలయుద్ధంలో మావోయిస్టులు ఇంత భారీస్థాయి దాడికి పాల్పడటం ఇదే మొదటిసారి కావడంతో సంచలనం రేగింది.
|