రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జోలె పట్టనవసరంలేదని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సోమ్మును కాజేయకుండా, సక్రమంగా ఖర్చు చేస్తే చాలని ఆయన హితవు పలికారు. 'మీకోసం' యాత్రలో భాగంగా బాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా కోటనందూరు మండలంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లడారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ప్రభుత్వం చేపట్టిన పథకాలను జోలె పట్టయినా పూర్తిచేస్తామని ప్రకటించడాన్ని బాబు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ తినడం మానేస్తే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రజల నిధులను స్వాహా చేయడం మానేస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలను అన్ని విధాలా నిలువు దోపిడీ చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఐదేళ్ళ దోపిడీ పాలనా రాష్ట్ర చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోతుందని చంద్రబాబు ఆరోపించారు.
|