రాష్ట్రంలో ఎన్నికలు ఫిబ్రవరికి ముందు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఇందిరమ్మ, పావలా వడ్డీ తదితర పథకాలను సమగ్రంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. త్వరలో ఎన్నికలు వస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కుంటు పడే అవకాశం ఉందనే సందేహాన్ని అధికారులు వెల్లడించడంతో ముఖ్యమంత్రై పైవిధంగా స్పందించారు.
ఎన్నికలు ఫిబ్రవరి, మార్చిలోపు ఏమీ ఉండవని, యథావిథిగా పథకాల అమలుపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో రైతు బజార్లలో మేలురకం బియ్యం కిలో రూ. 14కు విక్రయించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
అంతేకాకుండా పామాయిల్, కందిపప్పు పంపిణీని ఈ నెల 14వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్పవార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఖరీఫ్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల నుంచి నవంబర్ వరకు విద్యుత్ సరఫరా చేయానికి ఇతర రాష్ట్రాల నుంచి కరెంటును కొనుగోలు చేయడానికి ట్రాన్స్కో సన్నద్ధంగా ఉందని అధికారులు తెలియజేశారు.
|