రాష్ట్రంలో ఈ నెల 17న రెండో విడత ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఒంగోలులో ఈ పథకాన్ని యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభిస్తారమని వైఎస్సార్ తెలిపారు. హైదరాబాద్లో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ... ఉపఎన్నికల్లో ప్రభుత్వ విజయానికి తాము చేపట్టిన అభివృద్ధి పథకాలే కారణమని, వీటిని కలెక్టర్లు సరైన విధానంలో అమలు చేసిన కారణంగానే ప్రజలకు చేరాయని కొనియాడారు.
రాష్ట్రంలోని పేదలకు సరైన ఆరోగ్య చికిత్స అందాలనే లక్ష్యంతో అమలుచేస్తున్న ఆరోగ్య శ్రీ పథకం ఎంతో ఆదరణ పొందిందని సీఎం వెల్లడించారు. ప్రజల్లో తమపై ఎలాంటి వ్యతిరేకత లేదని, కలెక్టర్లను గత ప్రభుత్వం సరైన మార్గంలో ఉపయోగించుకోలేదని వైఎస్సార్ అన్నారు.
నిబధ్ధత గల అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజల కోసం తలపెట్టిన యజ్ఞంలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు తమపై బురదజల్లేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. అయితే ఎందులోనూ నిరూపించుకోలేక పోయాయని, కావాలనే బురద జల్లే పత్రికలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రి తెలిపారు.
|