కులాల వివక్షకు స్వస్తి చెప్పడం ద్వారానే ప్రజల్లో సమానత మొలకెత్తుతుందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర ముంబాయిలో ప్రారంభమై హైదరాబాదుకు చేరుకున్న సందర్భంగా ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయనేతలు కులాల పేరిట, ప్రాంతీయ వాదనతో చేసే పనులకు స్వస్తి చెబుతామని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన పసికందుకు కూడా కులాన్ని అంటగట్టే పరిస్థితి తొలగిపోతుందని చెప్పారు. కులాలు కుటిల రాజకీయాలవల్లే ఉద్భవించాయని జయప్రకాశ్ వెల్లడించారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల కొడుకులకు, కలెక్టర్ల కూతుర్లకు రిజర్వేషన్ కల్పించడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆరోపించారు.
భారత్ జోడో ఉద్యమంతోనే మనం ఆశించిన సమాజం రాగలదని జయప్రకాశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు పార్టీ తేడాలు లేకుండా కులం, మతం, ప్రాంతీయ వాదంతో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజస్థాన్లో గుజ్జర్ల అందోళన, కొందరు రాజకీయనేతలు మరాఠీలు ఎంచేశారంటూ అమితాబ్ను ప్రశ్నించడం ఇందుకు నిదర్శనాలని ఆయన ఎత్తి చూపారు.
|