సంక్షేమ పథకాల అమలులో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని, ఏ స్థాయిలోనూ అవినీతి జరిగినా సహించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండో రోజైన గురువారం ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అవినీతి నిర్మూలనకు ప్రత్యేకంగా దృష్టిసారించాలని అన్నారు. అన్నదాతలకు మేలు కలిగించే దిశగా ఎరువుల, విత్తనాల కొరత లేకుండా చూడాలని కలెక్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం సమాచార శాఖ రూపొందించిన నాలుగేళ్ల మన జిల్లాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం కృష్ణాజిల్లా కలెక్టర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ... ఎరువుల బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్న వారిపై జిల్లాలో మూడు కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణ విషయంలో విశాఖ జిల్లా ముందంజలో ఉన్నట్లు ఆ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి జిల్లాల్లోనూ సంక్షేమ పథకాల అమలుపై నిర్వర్తిస్తున్న కార్యక్రమాలను ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు ముఖ్యమంత్రి వైఎస్సార్కు వివరించారు.
|