ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టులపై, మీడియాపై విరుచుకుపడిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన "కంత్రి" చిత్రంపై ఆందోళనకు దిగారు. గురువారం మందకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. అబేద్కర్ వాడలో గూండాలు ఉన్నట్లు "కంత్రి" సినిమాలో చిత్రించారని కార్యకర్తలు ఆరోపించారు.
ఇందులో దళితులను కించపరిచేవిధంగా కొన్నిదృశ్యాలున్నాయని మందకృష్ణ పేర్కొన్నారు. అంబేద్కర్ను, దళితులను అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "కంత్రి" చిత్రంలోని అంబేద్కర్ను కించపరిచేలా ఉన్న సీన్లను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
"కంత్రి" చిత్ర నిర్మాత అశ్వనిదత్, దర్శకుడు మోహర్ రమేష్, హీరో ఎన్టిఆర్, ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్ బోర్డు కూడా తక్షణమే క్షమాపణలు చెప్పాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించక పోతే "కంత్రి" సినిమా ప్రదర్శిస్తున్న థియోటర్లవద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
|