గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. చిత్తూరు, కృష్ణా, వరంగల్, ఖమ్మం... ఇలా అన్ని జిల్లాలలోని ప్రజలు పెట్రోల్ కోసం క్యూ కట్టాల్సిన దుస్థితి. పరిస్థితిని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం పట్టింపులేని ధోరణిని ఆసరాగా తీసుకుని ఆయిల్ కంపెనీలు ప్రజల జేబులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద బ్రాండెడ్ పెట్రోల్ మాత్రమే లభ్యమవుతుందన్న బోర్డులు దర్శనమివ్వటమే దీనికి నిదర్శనం.
ఖరీఫ్ వ్యవసాయ అవసరాలు కూడా తోడవటంతో డీజిల్, పెట్రోల్ బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళుతున్నట్లు సమాచారం. ఇక చెన్నై-హైదరాబాదు జాతీయ రహదారిపై ప్రయాణించేవారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. మార్గమధ్యంలోని బంకుల్లో స్టాకు లేదు అన్న బోర్డును చూసి కుదేలవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 300 పెట్రోల్ షాపుల్లో అవసరాలకు తగిన సరఫరా జరగడం లేదని సమాచారం. ప్రభుత్వాలు ఈ పరిస్థితిని అదుపు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
|