తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతున్న మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఆగస్టు 27వ తేదీన బహిరంగ సభను తలపెట్టనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ఈ సభ ద్వారా తెలంగాణ సాధనకు శ్రీకారం చుడుతామని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
పార్టీ అజెండాపై ఇంకా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో, దేవేందర్ గౌడ్ తన పార్టీకి "ప్రజా తెలంగాణ"గా నామకరణం చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. గురువారం పెద్దిరెడ్డితో పాటు ఇతర ముఖ్యులతో సమావేశమై పార్టీ ఏర్పాటుపై చర్చలు జరిపారు.
ఇందులో భాగంగా "నవ తెలంగాణ"తో పాటు ఇతర పేర్లు కూడా పరిగణనలోకి తీసుకున్నప్పటికీ... చివరికి ప్రజా తెలంగాణ పేరు బాగుందని గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆగస్టు 27న జరిపే బహిరంగ సభకు ముందు విద్యార్థులను, ఉద్యోగులను ఉద్యమం దిశగా నడపాలని దేవేందర్ భావిస్తున్నారు. దీనికోసం ఈ నెల 9వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సదస్సు, 12న ఉద్యోగ సంఘాలతో ఆయన భేటీ నిర్వహిస్తున్నారు.
|