రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ కొత్త హంగులతో ముస్తాబవుతోంది. మెగాస్టార్ పార్టీ ఏర్పాటులో భాగంగా మండల, నియోజక వర్గాల, జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర నాయకుల నుండి కార్యకర్తలకు ఆదేశాలు వెలువడినట్లు సమాచారం.
రాజకీయ పార్టీ ఏర్పాటును చిరంజీవి ప్రకటించగానే అన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు లాంఛనంగా ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించాలని మెగాపార్టీ నిర్ణయించినట్లు వినికిడి. అంతేకాకుండా రాష్ట్రస్థాయి యూత్ కమిటీ నియామకాలకు రంగం సిద్దమౌతున్నట్లు పార్టీ శ్రేణుల సమాచారం.
ఇదిలా ఉండగా, నవ సమాజ నిర్మాణం కోసం విద్యావంతులు చిరంజీవి ఆధ్వర్యంలో కృషి చేయాలని "చిరు" గ్రాడ్యుయేట్స్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు అల్లు గోవిందరావు పిలుపు నిచ్చారు. ఈ విషయమై ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. విద్యావంతులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విద్యావంతులను, మేధావులను ఒకే వేదికపై తీసుకొచ్చి అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని అల్లు గోవిందరావు సూచించారు.
|