అణు సంక్షోభంలో చిక్కుకున్న యూపీఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) నుంచి సస్పెన్షన్కు గురైన ఆలె నరేంద్ర తన వంతు చేయూత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నుంచి సరైన హామీ పొందాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. నకిలీ పాస్ పోర్టుల కుంభకోణం కేసులో ఆలె నరేంద్ర పేరు ప్రస్తావనకు రావడంతో ఆయనను తెరాస అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.
దీంతో ఆయన సొంతగా తెరాస-నేషనలిస్ట్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నరేంద్రను కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు కలిసి మంతనాలు జరిపారు. అణు ఒప్పందం అంశంపై యూపీఏ ప్రభుత్వానికి అండగా నిలిచి, గట్టెక్కించాలని సూచించారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తేవాలని వారు కోరారు.
దీనికి సమస్మతించి నరేంద్ర బలపరీక్ష సమయంలో యూపీఏకు అండగా నిలువాలని నిర్ణయించారు. ఇదిలావుండగా తెరాస మాత్రం యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసింది. ఆ పార్టీ ఎంపీ బి.వినోద్ కుమార్ పేరుతో ఈ విప్ను జారీ చేశారు.
టెలిగ్రామ్ ద్వారా పంపిన ఈ విప్ను స్వీకరించేందుకు ఆయన సన్నిహితులు నిరాకరించినట్టు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేయాలని నరేంద్ర నిర్ణయించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.
|