యూపీఏకు అనుగుణంగా విశ్వాస పరీక్షలో ఓటు వేశారన్న కారణంతో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆదికేశవుల నాయుడును శుక్రవారం ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. అణుఒప్పందంపై విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న యూపీఏ సర్కారుకు మద్దతిస్తూ పార్టీ విప్ను ధిక్కరించి, ఆదికేశవుల నాయుడు ఓటు వేసిన సంగతి తెలిసిందే.
ఆ ఓటు చెల్లనప్పటికీ, బలపరీక్ష తర్వాత ఆదికేశవుల నాయుడు ప్రధాన మంత్రి మన్మోహన్ను కలిశారు. దీనితో ఆదికేశవులపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదిలా ఉండగా, ఒకవైపు పార్టీ బహిష్కరణల పర్వం సాగుతుండగా, మరోవైపు పార్టీకి రాజీనామా చేసే సభ్యుల సంఖ్య కూడా పెరిగిపోతుంది.
తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న విశాఖ-1 మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్.ఎ.రెహమాన్ ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. ఇకపోతే ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సజ్జా హేమలత తన పదవికి రాజీనామా చేశారు. మెగాస్టార్ పెట్టే కొత్త పార్టీలో చేరుతానని ఆమె తెలిపారు.
|