ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని మనోవర్తి కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. పవన్ కళ్యాణ్పై ఆయన మొదటి భార్య ఇటీవల బహు భార్యత్వం, మనోవర్తి కేసును విశాఖ పట్నం అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్... నందినికి ఐదుకోట్లను నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది కాలంగా నందిని దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మధ్యవర్తుల జోక్యంతో పవన్ ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకున్నట్లు తెలిసింది. దీనితో ఈ నెల 11-12 తేదీల్లో నందిని దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్, నందినిలకు గత 1997 మార్చిలో వివాహమైంది. కానీ కొద్దికాలానికే అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఇరువురు విడిపోయారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవన్ కళ్యాణ్ మరో మహిళను వివాహం చేసుకున్నారని నందిని కోర్టు కెక్కిన సంగతి విదితమే.
మొత్తానికి పవన్ కళ్యాణ్ బుధవారం నందినికి రూ.5కోట్లను నష్టపరిహారంగా చెల్లించేశారని సన్నిహిత వర్గాల సమాచారం. కాగా... కేసులను ఉపసంహరించుకోవడానికి వీలుగా రాజీ పిటిషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధమౌతోంది.
|