మెగాస్టార్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమౌతోంది. రాష్ట్రంలో పెను ప్రకంపనలకు సృష్టిస్తోన్న చిరంజీవి పార్టీకి ఆగస్టు నెలలో ముహూర్తం ఖరారు చేయనున్న నేపథ్యంలో... "చిరు" ఈ నెల 22వ తేదీన కంచి కామాక్షి ఆలయంలో చండీయాగం నిర్వహించనున్నారు.
యాగం ఏర్పాట్లను కామాక్షి ఆలయ అర్చకులు నటన శాస్త్రి గురుకుల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. ఈ మేరకు నటన శాస్త్రి గురుకుల్ ఆధ్వర్యంలో 50మంది వేదపండితులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చిరు సన్నిహిత వర్గాల సమాచారం. ఇకపోతే ఈ యాగంలో చిరంజీవి ఈ నెల 22న పాల్గొంటారని, అయితే ఏ సమయంలో అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ యాగం లక్ష్మీకటాక్షం, రాజ్యాధికారం కోసం నిర్వహిస్తారు. గతంలో మాజీ ప్రధానులు వాజ్పేయి, రాజీవ్ గాంధీకూడా ఈ యాగాన్ని నిర్వహించడం గమనార్హం.
ఇదిలా ఉండగా, ఫిలింనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన భార్య, కుమారుడు రామ్ చరణ్తేజ్తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా చిరు తన కుటుంబ సభ్యులతో కలిపి ఈ పూజలు చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ... ఆంజనేయుడు తన ఇష్టదైవమని ఆయన్ను దర్శనం చేసుకొని, ప్రజాక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు చెప్పారు.
మరోవైపు చిరంజీవి ఇంట శాంతి నెలకొనాలని, ఆయనకు మనశ్శాంతి కలిగించాలని కోరుతూ చిరంజీవి అభిమానులు శాంతి యజ్ఞం చేయించారు. కుల మతాలకు అతీతంగా చిరంజీవి అభిమానులంతా కలిసి పూజలు, యాగాలు జరిపిస్తున్నారు. గ్రహ దోష నివారణకు మహా రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమ పూజ, సర్వమత ప్రార్ధనలను చిరంజీవి అభిమానులు చేయిస్తున్నారు. ఒకవైపు మెగారైలు బండిలో పయనించేందుకు రాజకీయ నాయకులు వేచి ఉండగా, మరోవైపు అభిమానులు, ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్న చిరు పార్టీ ఎప్పుడు రంగ ప్రవేశం చేస్తుందో వేచి చూడాల్సిందే...!
|