తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖామంత్రి దామోదర రాజ నర్సింహా తెలిపారు. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం చెన్నయ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తమ రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. అంతేకాకుండా.. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోందన్నారు.
అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇక్కడి విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళుతామన్నారు. అంతేకాకుండా.. చెన్నయ్లో తెలుగు కల్చరల్ అసోసియేషన్, తెలుగు అకాడెమీ ఏర్పాట్లకు చర్య చేపడుతామన్నారు.
ముఖ్యంగా కల్చరల్ సంఘం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈ సంఘాన్ని నెలకొల్పుతామన్నారు. తెలుగు అకాడెమీని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి వుంటుందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఇదే విషయంపై వచ్చే నెలలో రాష్ట్ర తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నట్టు మంత్రి దామోదర రాజ నర్సింహా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి, ప్రధానకార్యదర్శి ఎంవీ.నారాయణ గుప్తా, కోశాధికారి నందగోపాల్, సీనియర్ నటులు గొల్లపూడి మారుతీ రావు, వంకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
|