రాష్ట్రంలో రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమం సఫలీకృతమైందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయనమీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... నాలుగేళ్ల పాలనలో సుమారు 12 ప్రాజెక్టలను పూర్తి చేసి, దాదాపు 14 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తున్నామని తెలిపారు.
మరో 15 లక్షల ఎకరాలకు సాగునీరును అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రజలెదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేలా తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పొన్నాల వివరించారు.
ఇదిలా ఉండగా, శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున సాగర్కు.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సాగర్కు పయనమైంది. ఎగువ ప్రాంతాల జూరాల, రోజా ప్రాజెక్టుల నుండి భారీగా వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం డ్యాం నీటి మట్టం భారీగా 876.40 అడుగులకు చేరుకుంది. దీనితో శ్రీశైలం డ్యాం నుంచి దిగువకు 97,836 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు.
ఇంకా ఎగువ ప్రాంతాల నుండి భారీగా నీరు వస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా నాలుగు గేట్లను ఎత్తివేసి సాగర్కు వరద నీరును విడుదల చేస్తున్నట్లు పొన్నాల వివరించారు. మరోవైపు కుడి, ఎడమల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... 66,223 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని పొన్నాల తెలిపారు.
|