కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నర్సాపురం లోక్సభ సభ్యుడు హరిరామ జోగయ్య మెగాస్టార్ చిరంజీవి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన చిరు పార్టీలో చేరనున్నారు. అంతేకాకుండా.. హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో రూపొందిన 'చిరు శంఖరావం' ఆడియోను మెగాస్టార్ మంగళవారం ఆవిష్కరించనున్నారు.
ఇందుకోసం జూబ్లీహిల్స్లోని మెగా పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అయిన జోగయ్య కొంత కాలంగా మాతృసంస్థపైనే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు చిరంజీవి గత ఆదివారం ప్రకటించిన మరుక్షణమే పార్టీకి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ మేరకు పార్టీ అధినేత్రికి, లోక్సభ స్పీకర్కు రాజీనామా లేఖలను పంపారు. గతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సేవలు అందించిన జోగయ్య.. ఆ పార్టీ నేతలతో తలెత్తిన మనస్పర్థల కారణంగా... ఆయా పార్టీలకు గుడ్బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా.. కాంగ్రెస్కు స్వస్తి పలికి చిరంజీవి పార్టీలో చేరేందుకు సిద్ధం కావడం గమనార్హం.
|