తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మకద్రోహులని, మోసగాళ్ళని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖర్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పిల్లను ఇచ్చిన మామనే మోసం చేసి సీఎం సీటు దక్కించుకున్న చంద్రబాబు నమ్మక ద్రోహిఅని, మోసగాడని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అధికారం కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదేనని, వారిదే గొప్ప రాజకీయమని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసింది... తెలుగుదేశం పార్టీయేనని సీఎం తీవ్రంగా ఆరోపించారు. నమ్మించి ద్రోహం చేయడం తమ ఇంటా వంటాలేదని చెప్పారు.
వర్షాకాల సమావేశాల్లో భాగంగా గురువారం సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణాల అవినీతిపై సభలో వాడీవేడీగా చర్చలు కొనసాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కొల్లేరు సరస్సు పరిధి నియంత్రణపై చర్చలు జరిగిన సందర్భంగా టీడీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించింది.
ప్రస్తుతం కొల్లేరు ప్రజల దుస్థితికి ప్రభుత్వమే కారణమని టీడీపీ ఆరోపించింది. దీనితో ఆగ్రహించిన సీఎం తెదేపాపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో తెదేపా హయాంలోనే కొల్లేరు సరస్సు అంశం సుప్రీం కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిందని గుర్తు చేశారు. టీడీపీవల్లే కొల్లేరు ప్రజలకు ఆ దుస్థితి కలిగిందని సీఎం విరుచుకుపడ్డారు.
|