అణుఒప్పందం యూపీఏ ప్రభుత్వానికి అడుగడుగునా పెను సమస్యగా పరిణమిస్తోంది. అణుఒప్పందంపై విపక్షాలు నిరసన వైఖరిని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో... యూఎన్పీఏ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీఏ ప్రభుత్వంపై గురువారం ధ్వజమెత్తారు. అణుఒప్పందం ముసుగుతో దేశ ప్రజలను యూపీఏ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు.
అణుఒప్పందం ద్వారా ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ భవిష్యత్తును అమెరికాకు తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాతో కుదుర్చుకున్న అణుఒప్పందంలోని లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని? బాబు ప్రశ్నించారు. ప్రధాని మన్మోహన్ తక్షణమే గద్దెదిగాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ బాధ్యతలు చేపట్టే అర్హత మన్మోహన్ సింగ్కు లేదని బాబు దుయ్యబట్టారు.
|