వచ్చే ఎన్నికల్లో తాము ఏ కూటమిలోనూ చేరబోమని, స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధులు డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో వారిద్దరు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ పార్టీయే ఏకైక ప్రత్యర్థిగా వారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని గద్దెదించే శక్తి, ఓడించగలిగే సత్తా తమ పార్టీకే ఉన్నాయని వారు జోస్యం చెప్పారు. దీని కోసమే ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారని వారు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో తమకు రెండో, మూడో సీట్లు తగ్గుతాయన్న సీఎం వ్యాఖ్యలకు స్పందిస్తూ... ఆ రెండు జిల్లాలోనూ ప్రతిస్థానంలో సుమారు 20 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు... సీటు... కావాలన్నదే తమ పార్టీ లక్ష్యం, ధ్యేయమని వారు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నమోదైన ఓట్లు తమకు కావాలని వారు వెల్లడించారు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించాక విధి విధానాలపై సీపీఎం నేతలు ఆసక్తి చూపారని తెలిపారు. పార్టీ విధానాలను వివరించేందుకే వారిని మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. విద్య, వైద్యం, ప్రభుత్వరంగ సంస్థలపై పార్టీ వైఖరి ఏమిటని సీపీఎం నాయకులు అడిగారని మిత్రా, పరకాల ప్రభాకర్లు వెల్లడించారు.
|