అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం నుంచి ఆశించినంత విధంగా సమాధానం రాకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అధికార పార్టీ ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీ వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు అసెంబ్లీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి.
ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ సమస్యలపై సభలో వాడివేడిగా చర్చ సాగింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభంకాగానే ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ పాతబస్తీలోని కరెంట్ కోతపై ప్రశ్నలేవనెత్తారు. దీనికి విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ... ప్రస్తుతం విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ఆయన ధ్వజమెత్తారు.
దీనికి తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.... మా హయాంలో సుమారు తొమ్మిది గంటల పాటు రైతులకు విద్యుత్ అందించామన్నారు. కాని ఇప్పుడు ఏడు గంటలకే విద్యుత్ సరఫరాను అందించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అనంతరం బాబు ఇచ్చిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ... గత తెదేపా హాయాంలో తొమ్మిది గంటలకు విద్యుత్ అందిస్తున్నప్పుడు ఎక్కువ ఖర్చు అయ్యేదని, ఏడు గంటలకు విద్యుత్ అందించడం ద్వారా తక్కువ ఖర్చవుతున్నట్టు వివరించారు.
|