తన వివాహ వివాదంలో ప్రజాపార్టీ అధినేత చిరంజీవిని లాగడంలో అర్థం లేదని పద్మారావు కోడలు నళిని స్పష్టం చేశారు. తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని నళిని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే ఎవరో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు.
తల్లిదండ్రులతో కలిసి ఉండటం తనకిష్టం లేదని నళిని కుండబద్దలు చేశారు. తనపై ప్రేమ ఉంటే వారే తన వద్దకు రావొచ్చునని, తన కోసం చిరంజీవి పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులను నళిని కోరారు.
ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రమేయంతో తమ కూతురికి బలవంతంగా పెళ్లి చేశారని నళిని తల్లిదండ్రులు టి.సుబ్బారావు, మణి దంపతులు గురువారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమ కూతుర్ని అప్పగించని పక్షంలో చిరంజీవి పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
ఇకపోతే... తమ్మిన సుబ్బారావు కుమార్తె అయిన నళినితో కత్తి పద్మారావు కుమారుడు వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కులాంతర వివాహంగా పలువురు ప్రముఖల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశ్వీరదించారు.
|