చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళేందుకు యువత ఆసక్తి కనబరుస్తున్నారని, వారికి పాస్పోర్టులు పొందేందుకు వీలుగా నిబంధనలను సవరించి మరింత సులభతరం చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజ్గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బి. బాలభాస్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాము పాస్పోర్టు సవరించే విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లానని లగడపాటి చెప్పారు. పోలీసు విచారణలో జరుగుతున్న జాప్యం కారణం వల్లే పాస్పోర్టు అందించడంలో అవకతవకలు జరుగుతోందన్నారు.
పొరుగుదేశాల్లో పాస్పోర్టు పొందడంలో పోలీసుల విచారణ అవసరం ఉండదని తెలిపారు. కాగా మనదేశంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాస్ పోర్టులు కావాలని ధరఖాస్తులు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. అనేక మంది పాస్ పోర్టులకు దరఖాస్తులు చేసుకున్నందున విజయవాడలో రీజనల్ పాస్ పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జిని కోరామని లగడపాటి తెలిపారు.
|