తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు ఆరాధ్య నటుడు దివంగత ఎన్టీరామారావు నట వారసులు ఆదివారం సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. యువరత్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లతో పాటు.. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి హరికృష్ణలు ఆదివారం ఉదయాన్నే తెదేపా అధినేత నివాసానికి విచ్చేశారు.
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశం చేసిన దరిమిలా నందమూరి నట వంశాన్ని కూడా ఆ రంగంలోకి దించాలని తెదేపా నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి పార్టీ ఏర్పాటు వల్ల తెదేపాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తెదేపాకు పూర్వ వైభవం తెచ్చిపెట్టేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
ఇందులోభాగంగానే ఆయన నందమూరి వారసులను తన ఇంటికి అహ్వానించి చర్చలు జరుపుతున్నారు. అయితే కేవలం మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తెదేపాకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఇప్పటికే సమ్మతించిన విషయం తెల్సిందే.
|