తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని నందమూరి వంశానికి చెందిన వెండితెర హీరోలు ప్రకటించారు. ఇందుకోసం తాము పార్టీకి అండగా ఉంటామని వారు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నందమూరి తారక రామారావు నటవారసులైన హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఆదివారం సమావేశమయ్యారు.
రాజధానిలోని చంద్రబాబు నివాసంలో వీరిమధ్య సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ఈ సమావేశంలో పార్టీకి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చినట్టు తెదేపా వర్గాల సమాచారం. ముఖ్యంగా వచ్చే ఎన్నికల ప్రచారంలో తాము పూర్తిస్థాయిలో పాల్గొంటామని వారు చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
దీంతో చంద్రబాబుకు ఎక్కడలేని బలం వచ్చినట్టయింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఎదురయ్యే పోటీని ధీటుగా ఎదుర్కొనేందుకు నందమూరి హీరోలను రంగంలోకి దింపాలని తెదేపా నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిన విషయం తెల్సిందే. ఆయన విజ్ఞప్తి మేరకు.. నందమూరి హీరోలు బాబుతో సమావేశమై తమ మద్దతును తెలిపారు.
|