రాష్ట్రంలో ఎరువులు లూటీ చేసిన వ్యవహారంపై అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు కోరారు. నిజామాబాద్లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎరువుల కొరత వల్లే రైతులు ఆగ్రహం చెందారన్నారు.
కొరత కారణంగానే వారు ఎరువుల లూటీ చేశారని చెప్పారు. కాగా తాను అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సోనియాగాంధీకి నివేదిస్తానని హనుమంతరావు తెలిపారు. ఈ నెల 11 తేదీన రాయలసీమ (అనంతపురం, తిరుపతి, కడప)లో పర్యటించనున్నారని చెప్పారు.
సోనియా పర్యటన సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతను ఆమె దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వీహెచ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరతలేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమెను కోరనున్నట్లు వీహెచ్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీలో బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
|