రమణీయమైన ప్రకృతి సౌందర్యాలను చూడలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. పూర్వజన్మ పాపపుణ్యాల కారణంగా పుట్టుకతోనే చూపు కోల్పోయి, ఏదో విధంగా జీవన బండిని లాగుతున్న అంధులు ఎంతోమందిని మనం ప్రతినిత్యం చూస్తుంటాం. అయితే ఇలాంటి అంధుల్లో పలువురు ఉన్నత శిఖరాలను చేరుకున్న వారూ లేకపోలేదు.
అలాంటి వారిలో.. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు. ఈయనకు పుట్టుకతోనే అంధత్వం ఉన్నప్పటికీ.. తనలోని మొక్కవోని పట్టుదలతో కళాశాల ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. ఇలా ఒక ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపాల్గా నియమితులై సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ ప్రిన్సిపాల్ పేరు.. సిద్ధారెడ్డి. నర్సాపూర్, వైజాగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ఆ తర్వాత ఆళ్ళపేట జూనియర్ కళాశాల, కర్నూలు సిల్వర్ జూబ్లి కళాశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తాజాగా నందికొట్కూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్స్పాల్గా నియమితులయ్యారు. మిగిలిన ప్రిన్స్పాల్స్ మాదిరిగానే రోజువారీ విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోవడం, తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయ వృత్తిలో వుండే వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
|