రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు సాధ్యం కాదని శుక్రవారం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... విపక్షాల ఆధ్వర్యంలో మాహాకూటమి వీలుకానందువల్లే తాము అధికారాన్ని పంచుకునే ప్రస్తావన తెచ్చామని చెప్పారు.
తమ ప్రస్తావనతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని నారాయణ తెలిపారు. అందుకే ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు సమాయత్తం అవుతోందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడు చిరంజీవి కలిసి పోటీచేయాలని సూచించారు. ఇరుపార్టీలు ఐదేళ్ళ పాలనను పంచుకొని అధిష్టానాన్ని పాలించాలని నారాయణ గతంలో ప్రకిటించిన సంగతి తెల్సిందే.
ఇదిలా ఉండగా...ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ నారాయణ చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ అధికార పంపిణీకి సంసిద్ధంగా లేదని చెప్పారు. నారాయణ వాదనలను తెలుగుదేశం పార్టీ కూడా తిరస్కరించిందని ఆ పార్టీనేతలు తెలిపారు. |