తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని శుక్రవారం ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల తొమ్మిదో తేదీనుంచి తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని పరకాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. చిరంజీవి జిల్లాల పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ భద్రతతో పాటు వ్యక్తిగతంగా సుమారు ఏడువందల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని పరకాల చెప్పారు.
చిరంజీవి చేపడుతున్న యాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన సమస్యలపై విధాన ప్రకటనలు చేస్తామని పరకాల వెల్లడించారు. తెదేపాతో కలిసి అధికారాన్ని పంచుకోవాలని భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. తమ పార్టీ మహాకూటమిలో చేరే ప్రసక్తే లేదని పరకాల కుండబద్ధలు చేశారు. |