ఈ నెల 16వ తేదీన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. ప్రభుత్వం తమకు 30 శాతం మధ్యంతర భృతి ఇవ్యాలని జేఏసీ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.
జేఏసీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి గౌడ్, ఇతర ప్రతినిధులు ఆనందరావు, తదితరులు ప్రభుత్వంతో శుక్రవారం సాయంత్రం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని వారు ఆరోపించారు.
ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు ఇతర హామీలను అమలు చేయడం లేదని జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ గోపాల్రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ నిరసన తెలుపడానికి 13న రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 16న జరిగే సచివాలయ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. |