మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ రిజిస్ట్రేషన్కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ వినయ్ స్పష్టం చేశారు. పీఆర్పీకి తప్పకుండా పూర్తి క్లియరెన్స్ లభిస్తుందని, ఇంకా ఎన్నికల కమిషన్ ప్రజారాజ్యం పార్టీని రాజకీయ పార్టీగా ప్రకటించాల్సిందే మిగిలి ఉందని వినయ్ అన్నారు.
చిరు పార్టీ అయిన పీఆర్పీ పేరుపై గురువారం ఎన్నికల కమిషన్ తుదిపరిశీలన చేసింది. దీనికి సంబంధించి ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ వినయ్, న్యాయవాది రఘునందన్ వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ... పార్టీని గుర్తిస్తూ ప్రత్యక్షంగా తమకు ఎన్నికల సంఘం త్వరలో ధ్రువీకరణ పత్రం పంపనుందని వెల్లడించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా... కడపకు చెందిన చెన్నకృష్ణయ్య అనే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీని తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పీఆర్పీ నేతలు చెన్నకృష్ణయ్యతో రాజీ చేసుకోవడంతో ఆయన తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. |