కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే విపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు వైఎస్సార్ను ఓడించాలని చూస్తున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తుందని సబితా జోస్యం చెప్పారు.
మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందువల్లే మైనార్టీలు ఎప్పుడూ కాంగ్రెస్కు మద్దతిస్తున్నాయని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తున్నానని సబితా ఈ సందర్భంగా తెలిపారు.
ఇదిలా ఉండగా, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు ఎట్టకేలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జపాన్ బ్యాంకు సహకారంతో 370 కోట్ల రూపాయల ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించారు.
నవంబర్ 14 నాటికి నగరంలో రోజూ రెండు గంటల చొప్పున తాగునీరు సరఫరా చేస్తామని సీఎం అన్నారు. అంతేకాకుండా నాలుగేళ్లలో హుస్సేన్ సాగర్కు పూర్వవైభవం తెస్తామని వైఎస్సార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. |