నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించిన దేవేందర్ గౌడ్ తన పార్టీ పేరును నవ తెలంగాణ పార్టీగా మార్చారు. దీంతో ఆయన పార్టీకి గుర్తింపునిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది.
నవ తెలంగాణ ప్రజాపార్టీ పేరుతో ఇప్పటికే ఓ పార్టీ పేరు రిజిష్టర్ అయిన కారణంగా దేవేందర్ గౌడ్ పార్టీ పేరును మార్చడమో లేక ప్రజా అనే పదాన్ని తొలగించడమో చేయాలని ఎన్నికల కమిన్ పేర్కొంది.
ఎన్నికల కమిషన్ సూచనతో చేసేదిలేక దేవేందర్ గౌడ్ తన పార్టీ పేరులోని 'ప్రజా' పదాన్ని తొలగించి పార్టీ పేరును నవ తెలంగాణ పార్టీగా నిర్ణయించారు.
రాష్ట్రంలో ఇటీవల కొత్తగా స్థాపించబడిన రెండు పార్టీలకు పేరుతోనే చిక్కులు రావడం విశేషం. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ ప్రజా పార్టీల పేర్లు అప్పటికే ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయిపోవడంతో చిక్కులు వచ్చిపడ్డాయి. పేరులోని పదం మార్పుతో దేవేందర్ గౌడ్ ఊపిరి పీల్చుకోగా చిరంజీవికి మరోలా ఈ సమస్య తీరింది.
చిరంజీవి విజ్ఞప్తి మేరకు ప్రజారాజ్యం పేరుతో రిజిష్టర్ చేసిన సదరు వ్యక్తి తన పార్టీ పేరు రిజిస్ట్రేషన్ను వెనక్కు తీసుకోవడంతో చిరంజీవి పార్టీ పేరుకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ కారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చిరంజీవి పార్టీకి గుర్తింపునిస్తూ ఇటీవల నిర్ణయాన్ని ప్రకటించింది. |