|
ఆంధ్రప్రాంత ప్రజల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకత లేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. దీన్ని చాటిచెప్పేందుకు ఈనెల 14వ తేదీన 500 కార్లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని తెలంగాణా భవన్ నుంచి ప్రారంభమయ్యే ఈ కాన్వాయ్ విశాఖపట్నం వరకు సాగుతుంది. ఆ తర్వాత 15న విశాఖలో కోస్తా కారిడార్కు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాలో కేసీఆర్ పాల్గొని సంఘీభావం ప్రకటిస్తారు.
అనంతరం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుపై మేధావులు, విద్యావంతులతో ఆయన చర్చలు జరుపుతారు. పిమ్మట 16వ తేదీన భద్రాచలం, సింహాచలం వంటి ప్రసిద్ధ ఆలయాలు సందర్శిస్తారు. ఈ తీర్థయాత్ర కోసం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజల్లోనూ వ్యతిరేకత లేదని చాటిచెప్పేదుకే ఈ కార్ల కాన్వాయ్ నిర్వహిస్తున్నట్టు తెరాస పార్టీ వర్గాలు వెల్లడించాయి.
|