|
రుణమాఫీ పథకం వర్తించని వారితో పాటు.. సకాలంలో రుణాలు చెల్లిన రైతులకు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వ జీవో నంబరు 297ను ఆయన జారీచేశారు. ఈ జీవో మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు.
అంతేకాకుండా నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేసేందుకు గాను తక్షణంగా 1600 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ ఆర్థికశాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి చేశారు. రైతు రుణమాఫీ పథకం వర్తించని, సకాలంలో రుణాలు చెల్లించిన చిన్న, సన్నాకారు రైతులను ఆదుకోవాలని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెల్సిందే.
వీటిపై ఇటీవలి వరకు మిన్నకుండిన ముఖ్యమంత్రి.. అకస్మికంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి, పరిస్థితిని సంబంధిత అధికారులతో చర్చించారు. ఇందులో ఆర్థిక మంత్రి రోశయ్య కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా నగదు బహుమతిని పాత రుణాల కింద బ్యాంకు అధికారులు జమ చేయకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ నగదు బహుమతిని ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు మండలాల వారీగా పంపిణీ చేస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రైతులకు వరం గాను, ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా మారింది.
|