రాయలసీమ చరిత్రను ఫ్యాక్షన్ చరిత్రగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొనడాన్ని పీసీసీ తప్పుబట్టింది. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి దిశగా సాగుతున్న రాయలసీమ చరిత్రను వక్రీకరించి చెప్పిన చిరంజీవి ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని పీసీసీ డిమాండ్ చేసింది.
చిరంజీవి తన రాయలసీమ పర్యటన సందర్భంగా చేసిన వివిధ వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి ఎన్. తులసి రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ప్రకారం దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎక్కడా లేనట్టు ఫ్యాక్షన్ అనేది రాయలసీమకే పరిమితం అన్నట్టు చిరంజీవి మాట్లాడడం పట్ల తులసిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాయలసీమ చరిత్రలో గర్వించదగ్గ ఎందరో ప్రముఖులున్నారన్న విషయాన్ని చిరంజీవి గుర్తెరిగి మాట్లాడాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా గణాంకాల వివరాల ప్రకారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో హత్యల సంఖ్య తక్కువేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో రాష్ట్రంలోని హత్యల సరాసరి బాగా తగ్గిందని ఆయన అన్నారు. |