తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని పులివెందుల తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డిలా తన సొంత నియోజకవర్గానికే అభివృద్ధిని పరిమితం చేయబోనని స్పష్టం చేశారు. తన రాయలసీమ యాత్రలో భాగంగా ఆయన బుధవారం పులివెందులలో పర్యటించారు. ఆయన నిర్వహించిన రోడ్షోకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. జనసందోహాన్ని ఉద్దేశించి చిరంజీవి ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ తరహాలోనే అభివృద్ధి చేయాలన్నదే తన ధ్యేయంగా చెప్పుకొచ్చారు. మహిళలు తమ ఆత్మబంధువు వచ్చినట్టుగా భావించి, సంతోషపడుతున్నారన్నారు. తాను సొంత ఊరు మొగల్తూరు ఏమీ చేయలేక పోయినా.. ఆ గడ్డ బిడ్డ నవశకానికి నాందిపలుకుతున్నాడని మొగల్తూరు వాసులు గర్వపడుతున్నారని చెప్పుకొచ్చారు. మొగల్తూరు వాసికి రాష్ట్రంలో లభిస్తున్న ప్రజాస్పందనను చూసి తన సొంతూరు వాసులు పులకించి పోతున్నారన్నారు. ఇంతకంటే.. సొంతూరు వాసులకు ఏమి ఇవ్వగలనని ప్రశ్నించారు. మంగళవారం జరిగిన ఘటనతో ఇక్కడకు వచ్చేందుకు కొంత భయపడ్డానని, అయితే.. ఇక్కడకు వచ్చాక జనం పూలదండలతో అపూర్వ స్వాగతం పలికారని చెప్పారు. తనకు రాజకీయాలు తెలియవు. రాజకీయ బంధువులు ఎవరూ లేరు. ధన, కండ బలం అంతకంటే లేదు. అయితే.. ఏమిచ్చినా తీర్చుకోలేని మీ ప్రేమ, వాత్సల్యం, అండదండలు ఉన్నాయన్నారు. వీటికి ఏవీ సరి కాదన్నారు. సాధారణంగా.. ప్రత్యేక ఆర్థిక మండళ్లలోకి ఎవరూ వెళ్లడానికి వీలులేదన్నారు. అయితే.. రాష్ట్రంలో కొత్తగా స్పెషల్ పొలిటికల్ జోన్స్ (ఎస్పీజడ్)లు ఏమైనా పెట్టారా? అని చిరంజీవి ప్రశ్నించారు. పులివెందుల అనే ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాలోనే ఉందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. అంతేకాకుండా.. పులివెందులకు నేను రావాలంటే పాస్ పోర్టు ఏమైనా కావాలా? లేక.. నేనేమీ అర్హుడిని కాదా? అంటూ ప్రశ్నించారు. మీరు చూపించే ప్రేమాభిమానాలే నాకు పాస్పోర్టు, వీసా అని చిరంజీవి అన్నారు. |