భారతీయ జనతా పార్టీకి చెందిన పీఠాపురం శాసనసభ్యుడు దొరబాబు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. దీంతో భాజపా రాష్ట్ర శాఖకు అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం ఒకటికి తగ్గిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున కిషన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, బుధవారం రాజధానిలోని గాంధీభవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి, పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ఆ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. ముఖ్యంగా తాను సమైక్యవాదినని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దొరబాబు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి బలం చేకూరిందని మంత్రి గొల్లపల్లి సూర్యారావు అభిప్రాయపడ్డారు. |