|
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చేవెళ్ళలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ద్వారా 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్కు 30 టీఎంసీల తాగునీరు లభిస్తుందని చెప్పారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నాలుగున్నరేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. రూ.38,500 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేసినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా తన జన్మసార్ధకమవుతుందన్నారు. ఎత్తిపోతల ద్వారా నీటిని పంపు చేయడానికి అవసరమయ్యే 3375 మెగావాట్ల విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేస్తామని చెప్పారు. రాష్టంలోని ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్తగా చేపట్టబోయే విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 15600 మెగావాట్లు లభిస్తుందని వివరించారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ను ఎక్కడి నుంచి తెస్తారని టీఆర్ఎస్, నిధులు ఎక్కడ నుంచి తెస్తారని టీడీపీ ప్రశ్నించాయని, సీపీఎం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళిందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టాలంటే ధైర్యం, నేర్పు, సత్తా కావాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అవన్నీ తమకు ఉన్నాయని, అందుకే వేల కోట్ల రూపాయల ఖర్చుకు వెనుకంజ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. తెలంగాణలోని ఏడు జిల్లాలకు లబ్ధి చేకూర్చే ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి (పీసీఎస్ఎస్) సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేసినట్టు చెప్పారు.
|