రాబోయే ఎన్నికలలోపు ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఓ నిర్ణయం చెప్పి తీరాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి రెండో ఎస్సార్సీ వేస్తామని చెప్పినట్టుగానే ఈసారి ఎన్నికల్లోనూ ఈ విషయమై ఏదో ఓ నిర్ణయం చెప్పక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇస్తామా, లేదా... ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేం అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎన్నికలకు ముందే చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నుంచి తనకు సంకేతాలు అందాయని చెబుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా డీఎస్ స్పంధిస్తూ ఆ విషయాలేవీ తనకు తెలియదన్నారు. తాను కేసీఆర్తో మాట్లాడి చాలాకాలం అయ్యిందని అందువల్ల ఆయన వ్యాఖ్యలపై స్పంధించబోనని అన్నారు.
అయితే కేసీఆర్ చెప్పినట్టు చెప్పాలంటే చాలా దమ్ముండాలని ఈ సందర్భంగా డీఎస్ పేర్కొన్నారు. అదేసమయంలో ప్రత్యేక తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందినది కాదని అది యూపీఏ ప్రభుత్వానికి కూడా సంబంధించినదని డీఎస్ వ్యాఖ్యానించారు. |