రాష్ట్రంలో విద్యుత్ కోసం ఏమేరకు డిమాండ్ పెరిగినా కూడా రబీ రైతులకు ఖచ్చితంగా ఏడుగంటలపాటు కరెంట్ ఇచ్చితీరాలంటూ మఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సెంటు భూమి ఎండిందనే అపవాదు తమ ప్రభుత్వానికి రాకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
సచివాలయంలోని తన కార్యాలయం వేదికగా గురువారం ముఖ్యమంత్రి రబీ కరెంట్ సరఫరాపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వీలున్నంతమేర కరెంట్ను ఉత్పత్తి చేయడంతోపాటు బయటినుంచి కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని పేర్కొన్నారు.
ఏపీజెన్కో, ట్రాన్స్కోలకు నిధుల పరంగా ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలంటూ ఆర్థికశాఖ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రబీ పంటకు కరెంటు సరఫరాకు సంబంధించి రాబోయే మే నెల వరకు సరిపడా నాఫ్తా కొనుగోలు ఒప్పందాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.
అదేసమయంలో ఏపీజెన్కోకు అదనంగా 2.5 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సిందిగా వైఎస్ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. |