తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వామపక్ష నేతలైన ప్రకాష్ కారత్, ఏబి.బర్ధన్లతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వామపక్ష అగ్రనేతలతో విడివిడిగా జరిపే ప్రత్యేక భేటీలో దేశ రాజకీయ పరిస్థితులతో బాటు రాష్ట్ర పొత్తులపై కూడా చర్చించనున్నారు. తెదేపాతో పొత్తుకు సీపీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయితే సీపీఐ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో పొత్తులపై నిర్ణయమే ప్రధానాంశంగా సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలోనే బాబు చర్చల నిమిత్తం ఢిల్లీకి వెళుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పొత్తులపై సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. హైదరాబాద్లో జరిగే పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో తమ కేంద్ర నాయకులు కూడా పాల్గొంటున్నారని ఇందులో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. |