|
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కడప జిల్లాలో రెండో రోజు చేపట్టిన ప్రజా అంకిత యాత్ర విజయవంతంగా ముగిసింది. చిరు కడప జిల్లా పర్యటన ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. చిరు యాత్ర మాత్రం ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసు వర్గాలు, ఇటు పీఆర్పీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ముఖ్యంగా రెండో రోజైన గురువారం ప్రశాంతంగా సాగింది. ఉదయం 11.30 గంటలకు ప్రొద్దుటూరులో బయలుదేరిన యాత్ర.. చాపాడు, ఖాజీపేట మీదుగా రాత్రికి కడపకు చేరుకుంది. దారి పొడవునా జనం నుంచి అనూహ్యస్పందన లభించింది. రైతులు తమ సమస్యలపై పలు చోట్ల చిరంజీవికి మొరపెట్టుకున్నారు.
దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా రైతు, కర్షక సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉండటమే కాకుండా రైతురాజ్యంగా పాలన సాగిస్తామన్నారు.
|