ఏ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా ఆలస్యం అనేది తప్పదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి రోశయ్య పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో నిర్మించిన సాగర్, తెలుగుగంగ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అందుకే ప్రాజెక్టుల నిర్మాణంలో తాము చిత్తశుద్ధితో ముందుకు వెలుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రోశయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి పలు అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలబెట్టిన ప్రాణహిత- చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
దీనివల్ల ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర నుంచి కూడా నిధులు అందుతాయని ఆయన తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని కలిసినపుడు ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్టు రోశయ్య పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అధిక ప్రాముఖ్యం ఇస్తోందని పేర్కొన్న ఆయన ఐదేళ్ల కాలానికి తమ ప్రభుత్వం రూ. 50,186 కోట్లను ఈ రంగానికి కేటాయించిందని అన్నారు.
నీటి పారుదల రంగానికి తాము కేటాయించిన నిధుల్లో గత ఆర్థిక సంవత్సరం వరకు రూ. 31,549 కోట్లు ఖర్చు చేశామని రోశయ్య పేర్కొన్నారు. అదేసమయంలో గత టీడీపీ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి ఐదేళ్లలో కేవలం రూ. 8557 కోట్లు కేటాయించి అందులో రూ. 7088 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణం గురించి టీడీపీ చేసిన ఆరోపణలను రోశయ్య తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అంతంత డబ్బులు ఎక్కడనుంచి వస్తాయని టీడీపీ ప్రశ్నిస్తోందని డబ్బు గురించి ఆలోచిస్తూ ఆశపడడం మానేస్తామా అని రోశయ్య ప్రశ్నించారు. ఆలోచన, ఆకాంక్షలే లేకుంటే అభివృద్ధి సాధించలేం అనే పట్టుదలతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రోశయ్య ముక్తాయించారు. |