ప్రభుత్వ ప్రోద్భలంతోనే ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై ఎస్టీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆ పార్టీ న్యాయ విభాగం ఆరోపించింది. ఈ కేసు నమోదు సమయంలో కనీసం ప్రాథమిక విచారణ సైతం నిర్వహించలేదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజారాజ్యం పార్టీ న్యాయ విభాగం ప్రతినిధి, మెట్రోపాలిటిన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తన్నీరు శ్రీరంగారావు, ప్రతినిధులు కేశవరెడ్డి, బాల్రాజ్, గూరుమూర్తి తదితరులు హైదరాబాద్లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరంజీవిపై నమోదైన కేసు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారానే పోలీసులు ఈ రకమైన చర్యలకు ఉపక్రమించారని వారు ఆరోపించారు. ఈ విషయమై చర్చించేందుకు శనివారం మాదాపూర్లోని ఇమేజ్ గార్డెన్లో న్యాయవాదుల సదస్సు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. ఈ సభకు పీఆర్పీ అధినేత చిరంజీవితో పాటు ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కూడా హాజరు కానున్నారని వారు తెలిపారు.
ప్రజా అంకితయాత్ర సందర్భంగా వరంగల్ జిల్లా కాజీపేటలో చిరంజీవి ప్రయాణిస్తున్న వాహనం ఓ వ్యక్తిని ఢీ కొనడంతో అతనికి గాయలయ్యాయి. దీంతో బాధితుడు కాజీపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరపాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిరంజీవిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. |