ప్రజారాజ్యం పార్టీ నిర్వహిస్తున్న 'సామాజి న్యాయ వారోత్స'వాల్లో భాగంగా.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి మెదక్ జిల్లా ములుగు మండలం సింగన్నగూడెంకు శనివారం వెళ్లనున్నారు. ఈ ప్రాంతంలో పీఆర్పీ శ్రేణులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాల్లో ఆయన పాల్గొంటారు. గత నెల 28వ తేదీన జ్యోతీరావ్ పూలే వర్ధంతి నుంచి డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి వరకు ‘సామాజిక న్యాయ వారోత్సవాల’ను ప్రజారాజ్యం పార్టీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన శనివారం పార్టీ నేతలు ఆయా జిల్లాల్లో సహపంక్తి భోజనాల కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ అధికార ప్రతినిధులు పరకాల ప్రభాకర్, డాక్టర్ మిత్రాలు శుక్రవారం విలేఖరులకు వెల్లడించారు. ప్రజా అంకిత యాత్ర తర్వాత రాష్ట్రమంతటా అంతటా స్తబ్దత వాతావరణం నెలకొంది కదా అని విలేకరులు ప్రశ్నించగా.. వారు తగు రీతిలో సమాధానం ఇచ్చారు. కోస్తా కారిడార్పై జరిగిన ఉద్యమంలో నాగబాబు, పోలేపల్లి సెజ్ బాధితుల ఉద్యమంలో తాను, అణు ఒప్పందంపై ధర్నాలో డాక్టర్ మిత్రా పాల్గొన్న విషయాన్ని ప్రభాకర్ గుర్తు చేశారు. ఇదిలావుండగా పీఆర్పీ చేపట్టిన సభ్యత్వ నమోదు ఇప్పటి వరకు కోటి దాటిందని చెప్పారు. అలాగే పార్టీ క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పి.శివశంకర్ను నియమించగా, సభ్యులుగా పి.ఉపేంద్ర, ఆంజనేయరెడ్డి, కెఎస్ఆర్.మూర్తి, దేవిశెట్టి శ్రీనివాసరావు, పి.కరుణ, తలారి మనోహర్లను నియమించినట్టు చెప్పారు. |