రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జడ్పీటీసీలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఏడు స్థానాల్లో ఆరు కాంగ్రెస్ పార్టీ వశంలో ఉండగా, . ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏక సంఖ్య నుంచి మూడుకు పెంచుకుంది. మిగిలి ఒక సీటును ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
కాగా, కర్నూలు జిల్లాలోని రెండు జడ్పీటీసీ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి పాలైంది. అధికార పార్టీ ఖాతాల్లో ఉన్న ఆలూరు స్థానాన్ని తెదేపా కైవసం చేసుకోగా, ఆళ్లగడ్డ స్థానాన్ని ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. మాజీ ఎంపి, ప్రజారాజ్యం జిల్లా కన్వీనర్ భూమా నాగిరెడ్డి తన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుని జిల్లాలో తన పట్టును నిరూపించారు. ఆళ్లగడ్డలో పీఆర్పీ అభ్యర్థి మాదం రవి. ఆలూరులో తెదేపా అభ్యర్థి మేకల భాస్కర్లు గెలుపొందారు.
ఇకపోతే.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ జడ్పీటీసి ఉప ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధించింది. ఈ పార్టీ అభ్యర్థి గోపాల్ నగేష్ విజయబావుటా ఎగుర వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అసెంబ్లీ ఎన్నికలను గుర్తుకు తెచ్చే విధంగా జరిగిన మూడు జడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. మూడు స్థానాలకు గానూ రెండింట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయగా, దెందులూరులో తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించి, మంత్రి మాంగటి బాబును తేరుకోకుండా చేసింది.
ఆచంట జడ్పీటీసీని కాంగ్రెస్ అభ్యర్థి ముప్పాల వెంకటేశ్వర రావు విజయం సాధించారు. పెరవలి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి విజయభాస్కరరావు గెలుపొందారు. ఈ మూడు స్థానాల్లో పోటీ చేసిన భాజపా, ఇండిపెండెంట్ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు.
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి జడ్పీటీసీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూము వెంకటాచలం (చినబాబు) తన సమీప టిడిపి అభ్యర్థి దాడి వెంకట రంగారావుపై 12,117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోటీలో ఉన్న ఆర్పిఐ అభ్యర్థి మట్టాడి శాంత కుమారికి 661 ఓట్లు, లోక్సత్తా అభ్యర్థికి 229 ఓట్లు లభించాయి. |